వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థలు, వసతి గృహాల పరిసరాల్లో ఎలాంటి వేధింపులు ఎదురైనా మౌనంగా ఉండకుండా నిర్భయంగా షీ టీమ్కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని షీ టీమ్ ఎస్సై ఉషారాణి పిలుపునిచ్చారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు.పట్టణంలోని బాలికల వసతి గృహంలో మహిళల భద్రత, చట్టపరమైన హక్కులపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు, విద్యార్థినులు తమపై జరిగే వేధింపులను చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమయానికి ఫిర్యాదు చేస్తే నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు జ్యోతి, సతీష్ మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం షీ టీమ్ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ఈవ్టీజింగ్, సైబర్ వేధింపులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, అసభ్యకర సందేశాలు, వెంటపడటం వంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు హెల్ప్లైన్లు, షీ టీమ్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.కార్యక్రమంలో విద్యార్థినులకు మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, షీ టీమ్ విధులు, ఫిర్యాదు చేసే విధానం, స్వీయ రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వేధింపులకు పాల్పడే వ్యక్తులపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Reporter
వాస్తవ గమ్యం