వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రామకృష్ణాపూర్, జూన్ 28: 12వ వేతన ఒప్పందం కోసం వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1న జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను కార్మికులు విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.ఆదివారం రామకృష్ణాపూర్లోని యూనియన్ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బ్రాంచ్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్, బ్రాంచ్ అధ్యక్షుడు సాంబారు వెంకటస్వామి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను సాకుగా చూపుతూ కోల్ ఇండియా యాజమాన్యం ఇప్పటివరకు 12వ వేతన ఒప్పంద కమిటీని ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు.ఈ విషయమై పలుమార్లు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో బొగ్గు రంగంలోని నాలుగు ఫెడరేషన్ల పిలుపు మేరకు జూలై 1న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.దేశంలోని ఇతర రంగాల్లో అమలు చేయని లేబర్ కోడ్లను కేవలం బొగ్గు రంగంలో మాత్రమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడం సరికాదని వారు విమర్శించారు. వెంటనే 12వ వేతన ఒప్పంద కమిటీని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్న బీఎంఎస్ కూడా నాలుగు ఫెడరేషన్లతో కలిసి ఐక్యంగా పోరాటాల్లో పాల్గొని కార్మిక ఉద్యమానికి బలం చేకూర్చాలని వారు సూచించారు.ఈ సమావేశంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు జడల ప్రవీణ్, నామాని సురేష్, అసిస్టెంట్ సెక్రటరీ ధనిశెట్టి సురేష్, ఏరియా ఆర్గనైజర్ బాసబోయిన కుమారస్వామి, పిట్ సెక్రటరీలు నాగవెల్లి శ్రీధర్, పసునూటి శ్రీకాంత్, అలాగే హరీష్, మహమ్మద్ తాజ్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం