వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో గురువారం ఆషాఢ మాస తొలి బోనాన్ని సమ్మక్క-సారక్క అమ్మవార్లకు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఆలయ ప్రధాన పూజారులు బొమ్మవోని సత్తయ్య గౌడ్, కరిగంటి బాపు ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు బోనాలను ఎత్తుకుని ప్రధాన వీధుల్లో సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి, కాగజ్నగర్ ప్రాంతాల నుంచి వచ్చిన శివశక్తులు చేసిన విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.డప్పుల చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన బోనాల ఊరేగింపులో మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. తిర్యాణి గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.గత 25 సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ సమ్మక్క-సారక్క అమ్మవార్లకు ఆషాఢ తొలి బోనం సమర్పిస్తున్నామని ఆలయ ప్రధాన పూజారులు బొమ్మవోని సత్తయ్య గౌడ్, కరిగంటి బాపు తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం