వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరామెరి మండలంలోని హట్టి ఆశ్రమ పాఠశాలలో నాసిరకం భోజనం అందించారంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం వండిన అన్నం తినలేని పరిస్థితి ఉండగా, సాయంత్రం కూడా నాణ్యత లేని కూర వడ్డించడంతో విద్యార్థులు ఆకలితో పాఠశాల నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.సమాచారం అందుకున్న ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్, విద్యార్థి, మహిళా, టైగర్ సేనా నాయకులతో కలిసి పాఠశాలకు చేరుకుని విద్యార్థులను శాంతింపజేశారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.విద్యార్థులు పాఠశాల హెచ్ఎం విధుల నిర్వహణ, బోధన లోపాలు, ఆహార సరుకుల నిర్వహణ, సిబ్బంది ప్రవర్తన, వాచ్మెన్ వ్యవహారశైలిపై పలు ఆరోపణలు చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్ఎంను మార్చడంతో పాటు సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే వరకు తరగతులను బహిష్కరిస్తామని హెచ్చరించారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఐటీడీఏ పీవో మంద మకరందు ఫోన్ ద్వారా నాయకులతో మాట్లాడి, విద్యార్థులకు న్యాయం చేస్తామని, ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం నాయకుల చొరవతో రాత్రి సుమారు 10:30 గంటలకు విద్యార్థులకు ప్రత్యేకంగా భోజనం వండించి అందించారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అయితే, విద్యార్థులు చేసిన ఆరోపణలు ప్రస్తుతం వారి వాదనలుగా మాత్రమే ఉన్నాయి. ఈ ఆరోపణలపై పాఠశాల హెచ్ఎం లేదా సంబంధిత అధికారుల అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.
Reporter
వాస్తవ గమ్యం