వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం బెల్లంపల్లి మండల కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, రోగులకు అందుతున్న సౌకర్యాలు, ఆసుపత్రి పరిశుభ్రతను పరిశీలించారు. రోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.అనంతరం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్తో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.తదుపరి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ నెల 24లోగా ప్రక్రియ పూర్తి చేసి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వివరాలను నమోదు చేయాలని అధికారులకు సూచించారు. భూ భారతి, రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తుల పరిష్కార పురోగతిని సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి సమీక్షించి పలు సూచనలు చేశారు.అనంతరం కాసిపేట మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు తరగతి గదులు, భోజనశాల, మూత్రశాలల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వంటశాలను పరిశీలించి మధ్యాహ్న భోజనానికి వినియోగించే నిత్యావసర సరుకుల నాణ్యతను తనిఖీ చేసి, ఆహార తయారీలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం