వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పరిధిలోని యాపల్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా సీసీ కెమెరాల ఏర్పాటుపై శనివారం ఒక ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. మందమర్రి సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) జి. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక కాలనీవాసులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ జి. నరేష్ మాట్లాడుతూ.సమాజంలో ప్రజల రక్షణకు, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టకు సీసీ కెమెరాలు 'మూడో కన్ను'లా పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రతి కాలనీ, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను ముందే నివారించవచ్చన్నారు. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా, నిందితులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈ నిఘా నేత్రాలు ఎంతో దోహదపడతాయని వివరించారు. ప్రజలందరూ బాధ్యతగా భావించి, తమ పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, ప్రముఖులు పూర్తి మద్దతు ప్రకటించారు. యాపల్ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.ఈ అవగాహన సమావేశంలో స్థానిక ప్రముఖులు బొద్దిరెడ్డి వెంకటరెడ్డి, ఎం.డి. అబ్బాస్, బొద్దున ఓంప్రకాష్, వనం నర్సయ్య, సంగార్తి సంతోష్, అడ్డూరి సాంబమూర్తి, పిండి సురేష్, కొమిరిశెట్టి తిరుపతి, జిల్ల రాజు తదితరులు పాల్గొని సీసీ కెమెరాల ఏర్పాటుకు సంఘీభావం తెలిపారు.
Admin
వాస్తవ గమ్యం